
తెలుగు సినిమా పరిశ్రమలో సంస్కరణల కోసం ఆర్ నారాయణ మూర్తి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట నంది అవార్డులను తిరిగి ప్రవేశపెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదే ఉత్సాహంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. 25 ఏళ్లుగా శాతం విధానం కోసం ఆయన చేస్తున్న పోరాటం ఇంకా ఫలించలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విధానం అమలు కాకపోవడం వల్ల నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రామానాయుడు, దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతలు ఈ విధానాన్ని సమర్థించినప్పటికీ, అమలులో జాప్యం ఆయన్ను కలవరపెడుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నియామకంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, శాతం విధానంపై దృష్టి సారించాలని సూచించారు. టికెట్ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులను సినిమాకు దూరం చేస్తోందని, బ్లాక్ మార్కెటింగ్ను పెంచుతోందని హెచ్చరించారు. ప్రభుత్వం, ఫిల్మ్ ఛాంబర్, కౌన్సిల్లు సమిష్టిగా ఈ సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.