
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. థియేటర్ల బంద్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. జూన్ 1న థియేటర్ల బంద్ ప్రకటన వెనుక దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఉన్నారని, తనను బలిపశువుగా చేసేందుకు దిల్ రాజు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. “దిల్ రాజు తన తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై అబద్ధపు ఆరోపణలు చేశారు. కమల్ హాసన్ను మించి ఆస్కార్ రేంజ్లో నటించారు” అని అత్తి సత్యనారాయణ విమర్శించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరును ఎత్తారని, దురుద్దేశంతో తన పేరును ఈ వివాదంలోకి లాగారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను థియేటర్ల బంద్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యం” అని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తనను రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించి, సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.ఈ వివాదం సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అత్తి సత్యనారాయణ ఆరోపణలపై దిల్ రాజు, శిరీష్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన జనసేనలో అంతర్గత కల్లోలానికి దారి తీస్తుందా లేక వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది.