
భారతదేశం పాకిస్తాన్ శత్రు సైన్యం, ఉగ్రవాద మూకలపై నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్లో తెలుగు వీర జవాన్ మురళి నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఒక్కగానొక్క కొడుకు, పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మురళి నాయక్ తల్లిదండ్రులు తమ బాధను దిగమింగినప్పటికీ, కొడుకు దేశం కోసం మరణించడం తమకు గర్వకారణమని గతంలో తెలిపారు.
ఈ నేపథ్యంలో ‘సోలో బాయ్’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళి నాయక్ కుటుంబానికి చిత్ర బృందం నుంచి ఆర్థిక సహాయం అందింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ త్వరలో ఒక మ్యూజికల్ నైట్ నిర్వహించి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ కుటుంబానికి అందజేస్తామని ప్రకటించారు.
అయితే ఈ ఈవెంట్కు యాంకర్గా వ్యవహరించిన చొక్కారపు స్రవంతి తన వంతుగా మురళి నాయక్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ కుటుంబం కోసం నిర్వహించబడే మ్యూజికల్ నైట్కు తాను ఉచితంగా యాంకరింగ్ చేస్తానని తెలిపారు. ఒక భారతీయురాలిగా ఈ కుటుంబానికి అండగా నిలబడటం తన బాధ్యత అని స్రవంతి ఉద్ఘాటించారు.
స్రవంతి గతంలోనూ తన మానవత్వాన్ని, దేశభక్తిని చాటుకున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో ప్రభుత్వానికి లక్ష రూపాయల సాయం అందించడంతో పాటు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర కుటుంబానికి సాయం అందించి స్రవంతి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.