
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ కోసం చెన్నై నుండి గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు, విశ్వహిందూ పరిషత్ తరపున 11 గొడుగులు సమర్పించారు. రేపు సాయంత్రం జరిగే గరుడవాహన సేవకు ఈ గొడుగులను అలంకరించనున్నారు. విశ్వహిందూ పరిషత్ శతాబ్దాలుగా గొడుగులు అందిస్తుండగా, హిందూ ధర్మార్థ సమితి గడిచిన 21 సంవత్సరాలుగా చెన్నై నుండి పాదయాత్రగా గొడుగులను తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర , అదనపు ఈవో శ్రీ చ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్ కెవి మురళి కృష్ణ, అలాగే ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ తో పాటు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. వాహన సేవ సందర్భంగా వివిధ సాంస్కృతిక బృందాలు ప్రదర్శించిన కార్యక్రమాలను అధికారులు వీక్షించారు. కళాకారుల భక్తి, క్రమశిక్షణ, అద్భుతమైన ప్రదర్శనను వారు అభినందించారు. బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా తమ సేవలను కొనసాగించాలని కళాకారులను ప్రోత్సహించారు. వాహన సేవను సజావుగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను కూడా అధికారులు ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, సిబ్బందికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
